సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంలోని పడిగరాయి గుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని విశేష పూజలు,అర్చన కార్యక్రమాలు కన్నుల పండుగగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు.
2007వ, సంవత్సరంలో స్వయంగా వెలిసి భక్తులు కొలిచిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో మంగళవారం అర్చకుల వేద మంత్రాల నడుమ గణపతి పూజ, పుణ్యహవచనము, రక్షాబంధన, క్రతువు అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు,ఉత్సవిగ్రహాలకు పంచసూక్త విధంగా పంచామృతాలతో, పంచ మహా నదుల జలాలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి సహస్ర నామాలతో కుంకుమార్చన, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారికి సహస్ర నామాలతో మల్లెలతో పుష్పార్చన, తులసి,ఆరెపత్రి తో అర్చించి, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.మహా నివేదన,నీరాజన,వేద మంత్రపుష్పం సమర్పించిన పిదప తీర్ధ,ప్రసాదాలు అందజేసిన అనంతరం అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇనపకుతికల నర్సింహమూర్తి శర్మ,ఆలయ అధ్యక్షుడు శాగంరెడ్డి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొనుగుపాటి వేంకటేశ్వర రావు, సభ్యులు తోడేటి సర్వయ్య,గుర్రం వెంకటరెడ్డి, ఎన్.వెంకటమ్మ,కె.గోపిరెడ్డి,జి.వెంకటరెడ్డి, స్వామి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్, హుజూర్ నగర్