విజయనగరం జిల్లా సీసీఎస్ డీఎస్పీగా పని చేసి, అకాల మరణం చేసిన జుట్టు పాపారావు మృతి జిల్లా పోలీసుశాఖకు తీరని లోటని, ఆయన చేసిన సేవలు మరువలేనివని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు.
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ జే. పాపారావు మృతికి సంతాపం తెలియచేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో స్మృతి సభను నిర్వహించారు. ఈ స్మృతి సభకు జిల్లా ఎస్పీ రాజకుమారి హాజరై, డీఎస్పీ పాపారావు చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం, పోలీసు అధికారులు రెండు నిమషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ జిల్లా పోలీసుశాఖకు పెద్దన్నలాంటి డీఎస్పీ పాపారావును కోల్పోవడం చాలా విచారకరమన్నారు.
గత రెండేళ్లుగా జిల్లాలో ఎక్కడైనా ఆస్తికి సంబంధించిన నేరం రిపోర్టు అయితే దానిని పరిష్కరించేందుకు పాపారావు ఉన్నారన్న భరోసాను నాకు కల్పించేవారన్నారు. తన సమర్ధతతో రాష్ట్ర డీజీపీ నుండి రెండుసార్లు ఏబీసీడీ అవార్డును అందుకొని, జిల్లా పోలీసు పేరును రాష్ట్ర స్థాయిలో ఇనుమడింప జేసాడన్నారు.
ఆరు మాసాలు జిల్లాలో రెండు సబ్ డివిజన్లుకు డీఎస్పీల పోస్టింగులు లేనప్పటికీ, బొబ్బిలి ఇన్ చార్జ్ గా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా సమర్ధవంతంగా పని చేసారన్నారు.
అంతేకాకుండా, ఎన్నికల్లో ఎక్కడ సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా డీఎస్పీ పాపారావును నియమించే వారమని, అది ఆయన సమర్ధతకు నిదర్శనమన్నారు.
అకాల మరణం పొందిన డీఎస్పీ పాపారావు యూనిట్ అధికారులకు ఎల్లప్పుడూ అండగా నిలిచేవారని, వృత్తి పట్ల ఆయన నిబద్ధత పోలీసు శాఖకు ఆదర్శమని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు మాట్లాడుతూ డీఎస్పీ పాపారావు సీజనల్ డాక్టరు వలే పోలీసుశాఖ అవసరాలను బట్టి తనను మార్చుకుంటూ విధులు నిర్వహించే వారన్నారు.
ఆటోలో చోరీ జరిగి 80సవర్ల బంగారు నగలు చోరీకి గురయ్యాయని తెలుసుకున్న గంట వ్యవధిలోనే మొత్తం వస్తువులను స్వాధీనం చేసుకోవడం, అందుకు బాధ్యులను అరెస్టు చేయడం జరిగిపోయేవన్నారు.
దేవాలయాల్లో దొంగతనాలు మొదలు పెద్ద పెద్ద చోరీలకు ఆయన హయాంలో డిటెక్ట్ చేయడం ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు.
ఈ సంతాప సభలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, ఎన్.రామారావు, ఎఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, సీఐలు బి.వెంకటరావు, ఎన్.శ్రీనివాసరావు, జి. రాంబాబు, జె.మురళి, సిహెచ్. శ్రీనివాసరావు, ఎర్రంనాయుడు, సిహెచ్. శ్రీధర్, జి. గోవిందరావు, విజయానంద్, కాంతారావు, ఈ. నర్సింహారావు, ఆర్ఐలు చిరంజీవి, పి.నాగేశ్వరరావు, టివిఆర్ కే కుమార్, పి. ఈశ్వరరావు, పలువురు ఆర్ఎస్ఐలు పాల్గొని, డీఎస్పీ పాపారావు చిత్రపటానికి పూలను సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.