యాంటీ వైరల్ డ్రగ్ అయిన రెమిడిస్వేర్ కరోనా వ్యాధి సోకిన వారికి సంజీవని లాంటి ఔషధం కాదని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో రెమిడిస్వేర్ ఇంజెక్షన్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.
రెమిడిస్వేర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో కూడా అమ్ముకునే దౌర్భాగ్యులు ఉన్నారు మన దేశంలో.
ఆసుపత్రులు కూడా రెమిడిస్వేర్ ఇంజక్షన్ ఒక్కటే కోవిడ్ 19కు పరిష్కారం అయినట్లు చెప్పడంతో దానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతున్నది.
రెమిడిస్వేర్ తయారు చేసే కంపెనీల వద్ద జనం బారులుతీరి కనిపిస్తున్నారు. ఈ ఇంజక్షన్ అందరు కరోనా రోగులకు పని చేయదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ఇంజక్షన్ చేయడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి కరోనా రోగి బయటకు రాలేడని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
ఛాతీ ఎక్స్ రే లేదా సిటి స్కాన్ లో తేడా కనిపించినప్పుడు, ఆక్సిజన్ తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, వ్యాధి తీవ్రత అంతగా లేని వారికి మాత్రమే రెమిడిస్వేర్ పని చేస్తుందని ఆయన వివరించారు.
ఇంత కన్నా మంచి యాంటీ వైరల్ డ్రగ్ లేనందున దీన్ని వాడుతున్నారు తప్ప ఇది సంజీవని లాంటి మందు కాదని ఆయన తెలిపారు.
అంతే కాకుండా ఈ మందు వినియోగించేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన వివరించారు.
కరోనా సోకగానే రెమిడిస్వేర్ ఇచ్చినా, చివరి దశలో ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తెలిపారు.
కరోనా రోగులకు వారి రోగ లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సిందే తప్ప కేవలం రెమిడిస్వేర్ ఇవ్వడంతోనే బతికిపోతారని అనుకోవడం కరెక్టు కాదని డాక్టర్ గులేరియా తెలిపారు.