డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు కొనియాడారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబూజగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ అరవింద బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం, సత్యాగ్రహం ఉద్యమాలలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని, దళితుల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారని తెలిపారు.
దేశానికి ఉప ప్రధానిగా, రక్షణ శాఖ, కేంద్ర కార్మిక శాఖ, రైల్వే, రవాణా తదితర శాఖల మంత్రిగా పనిచేశారని సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఎనలేని కృషిచేశారని డాక్టర్ అరవింద్ బాబు తెలిపారు. అటువంటి మహానుభావుని నిత్యం స్మరించుకోవాలని ఆయన కోరారు.
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడంతో మరింత ఘనంగా జరుపుకోలేక పోయినందుకు బాధగా ఉందని అరవింద బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.