వైద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన వారు కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్త సంగతి అలా ఉంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు హైదరాబాద్ లోని సనత్ నగర్ ఇ ఎస్ ఐ సి ఆసుపత్రి అధికారులు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినా, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినా నా రూలే పాటించాలి తప్ప మరెవరి రూలూ ఇక్కడ నడవదు అంటున్నారు అక్కడి డీన్ శ్రీనివాస్. కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఆయన సిబ్బందిని వేధిస్తున్నారు.
ఎన్ని సార్లు రిక్వెస్టు చేసినా వినకపోవడంతో డీన్ పై నర్సింగ్ యూనియన్ జనరల్ ప్రకాష్ బాబు ఇ ఎస్ ఐ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్ కారణంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఫింగర్ ప్రింట్ పంచ్ తీసేశారు.
ఒకరి తర్వాత ఒకరు వేలి ముద్ర ఇవ్వడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేసినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ పంచ్ అటెండెన్సు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేవలం అటెండెన్సు రిజిస్టర్ ద్వారా మాత్రమే సిబ్బంది హాజరు వేయాలి.
అయితే ఇక్కడి డీన్ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. మహిళ నర్సులు దూర ప్రాంతాల నుండి వచ్చి డ్యూటీ చేయాలి లాక్ డౌన్ వల్ల వారికి రవాణా ఇబ్బంది ఉంది. అయితే నాకు వాటితో సంబంధం లేదు అంటూ సిబ్బందిని డీన్ వేధిస్తున్నారని ప్రకాష్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులకు ఐడి కార్డు చూపిస్తున్నా వదలడం లేదని అందువల్ల తాము రాలేకపోతే వేధించవద్దని చెప్పినా ఆయన వినడం లేదని నర్సులు అంటున్నారు. తమకు రవాణా సౌకర్యం కల్పిస్తే తాము మరింతగా రోగులకు సేవ చేసే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు. అయితే వాటితో తనకు సంబంధం లేదని డీన్ చెబుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.