దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం తొలగిపోవాలని అమేథిలోని ప్రయాగ్ రాజ్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. సంపద లక్ష్మీ దేవిని సంతృప్తి పరచడానికి ప్రత్యేక త్రిశూల్ పూజలు నిర్వహిస్తున్నట్లు అమెథిలోని పరమహాన్స్ ఆశ్రమానికి చెందిన మహంత్ మౌని మహారాజ్ తెలిపారు. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారని మహంత్ మౌని మహారాజ్ అన్నారు. అందుకే తాము ఈ పూజ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ త్రిశూల్ పూజలు నెల రోజుల పాటు కొనసాగుతాయి.
పూజల సంగతి ఎలా ఉన్నా ఈ ఏడాది ఆర్ధిక సంక్షోభం మరింత ముదురుతుందని నివేదికలు చెబుతున్నాయి. భారత్ కు ఈ ఏడాది అతి పెద్ద సంక్షోభం ఉందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. భారతదేశంలో యువత కు నిరుద్యోగ ముప్పు మరింత ఎక్కువ కానున్నదని కూడా అధ్యయనం సూచిస్తుంది. 2020 సంవత్సరంలో ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో ఉండటం వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుందని అంటున్నారు. దేశ ఆర్ధిక వేత్తలు చేతులెత్తేసిన ఈ నేపథ్యలో త్రిశూల్ పూజ అయినా దేశాన్ని కాపాడుతుందో లేదో చూడాలి.