మునుగోడు ప్రచారంపై పాలకవర్గానికి ఉన్న మోజు, వరద, బురద గోసతో కల్వకుర్తి నియోజకవర్గం తల్లడిల్లుతుందని తెలియదా? ప్రజల కష్ట నష్టాలు పట్టవా అని కొందరు నాయకులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రశ్నిస్తున్నారు. మునుగోడు ప్రచారంపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గంలో వర్షాలతో ప్రజలు అగచాట్లు పడుతుంటే కనిపించడం లేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
వెల్దండ మండలం బైరాపురం గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు చెరువును తలపిస్తున్న కాలువను ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని దాటుతుండగా ఒడ్డు పై ఉన్న తల్లిదండ్రుల గోస వర్ణనాతీతమని, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కుందారం తండా, లాల్ తండా వాసులు రేషన్ బియ్యం కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అజిలాపూర్ మధ్యలో ఉన్న కాలువను దాటుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలోని పలు గ్రామాలను తండాలను కలుపుతూ రహదారుల మధ్యలో ఉన్న కాలువలు, వాగులు దాటడానికి నరకం చూస్తున్నా జనవాసాలు పడే కష్టాల వీడియోలు పంపుతున్నారు. నియోజకవర్గంలో విద్యానగర్ 11వ వార్డ్ లో అధినేత ఇంటి దగ్గరే కాలనీవాసుల బురద కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ పాలకులు ప్రచారానికే తప్ప పరిపాలనకు పనికిరారని ఎద్దేవా చేస్తున్నారు.
రెండు పిల్లులు రొట్టెకోసం పోట్లాడితే రొట్టె కోతి పాలైనట్టు గత ఎన్నికల్లో రెండు గెలుపు గుర్రాల పార్టీల నాయకులు పోట్లాటకు దిగిన సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో విజయం సాధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే పనితీరు మారలేదని మారదని ఒక్క సిరామరకతో ఒక్క నొక్కు నొక్కినందుకు ఐదేళ్లకు జనం బలయ్యారనిసెటైర్లు వేస్తున్నారు.
ఎన్నికల్లో వారి వారి గెలుపు కోసం ఖర్చు పెట్టే డబ్బుతో గ్రామాల నియోజకవర్గాల సమస్యలను తీర్చడానికి, అభివృద్ధికీ ఖర్చు చేస్తే కచ్చితంగా వారే ఎన్నికల్లో విజయం సాధించడానికి సులభతరం అవుతుందని రాష్ట్ర పరిపాలన మొత్తం పక్కన పెట్టి ఒక్క నియోజకవర్గంలో గెలుపు కోసం అధికార పార్టీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం లేదు కదా అని కొందరు రాజకీయ మేధావులు సూచిస్తున్నారు.
తాము మాత్రం వర్షంలో తడవకుండా గొడుగు కింద ప్రచారం చేసుకుంటూ ఓటు వేయించుకొని గెలిచి అధికార అహంకారంతో ప్రజల గోడు, గోస వినని నాయకులను రానున్న రోజుల్లో ప్రజలు తమకున్న ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని వివిధ పార్టీల నాయకులు సూచిస్తున్నారు.
పోలా శ్రీధర్, సత్యంన్యూస్.నెట్, కల్వకుర్తి