తిరుమల శ్రీవారి 100 కోట్ల ఆదాయానికి టిటిడి అధికారుల నిర్లక్షం కారణంగా గండి పడే ప్రమాదం పొంచి వుందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు రేపు తిరుమలలో జరిగే టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.
తక్షణమే శ్రీవారి సొమ్మును నేషనల్ హైవే అథారిటీ నుంచి రాబట్టి వెంకన్న ఖాతాలో జమ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి చంద్రగిరి మార్గంలో టిటిడి డైరీ ఫాం ( గోశాల) వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం టిటిడి కి చెందిన సుమారు 6.45 ఎకరాల స్థలం భూ సేకరణ చేసి పనులు ప్రారంభించారే తప్ప ల్యాండ్ అక్వైజేషన్ యాక్ట్ ప్రకారం టిటిడి కి చెల్లించాల్సిన సుమారు 100 కోట్లకు గాను కేవలం 15 కోట్లు అవార్డ్ పాస్ చేయడం ఇప్పటి వరకు టిటిడి కి చిల్లిగవ్వ కూడా చెల్లించకపోయినా టిటిడి ఉన్నతాధికారులు స్పందించక పోవడం శోచనీయమని ఆయన అన్నారు.
టీటీడీ డైరీ ఫామ్ వద్ద భూమి విలువ సబ్ రిజిస్టర్ వేల్యూ ప్రకారం స్క్వైర్ యాడ్ 2018 లో 15000 వుంది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం టిటిడి భూమి ప్రజా అవసరాలకు ఇవ్వదలిస్తే వంద శాతం అధికంగా చెల్లించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అవసరం లేకపోయినా కల్యాణ మండపాల నిర్మాణానికి నిధులు కేటాయించడం అలాగే దేవాదాయ శాఖ ఆలయాలను టీటీడీ లో విలీనం చేసుకోవడం భవిష్యత్తులో టిటిడి పై ఆర్థిక భారం పడుతుందని అలాంటి వాటికి ధర్మకర్తల మండలి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన అన్నారు. దీనిపై ఉద్యోగ సంఘ నాయకులు కూడా ప్రశ్నించాలని అన్నారు.