తునికాకు సేకరణదారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బోనస్ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. సిర్పూర్ నియోజవర్గంలోని కర్జెల్లి అటవీ రేంజ్ చింతలమానేపల్లిలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోనేరు కొనప్ప, ఆత్రం సక్కు, పీసీసీఎఫ్ (HoFF) ఆర్. యం. దొబ్రియల్, సీసీఎఫ్ వినోద్ కుమార్, కలెక్టర్ హేమంత్ బొర్కడే, జిల్లా అటవీ అధికారి ఆశీష్ సింగ్, ఎఫ్డీవో విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తునికాకు సేకరణ చార్జీలతో పాటు రెవెన్యూ నెట్ షేర్ (బోనస్) ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఏజెన్సీ గ్రామాలకు ఇది ఉపాధి వనరు. రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ. 200 కోట్లను బోనస్ ( నెట్ రెవెన్యూ) చెల్లిస్తున్నాం బీడీ ఆకుల సేకరణ రేట్ పెంచుతూ (G.O.Rt No. 15) జారీ చేశాం. కట్టకు రూ. 2.05 పైసల నుంచి రూ. 3 కు పెంచాం.
ఈ సీజన్ నుంచి ఈ రెట్లు వర్తింపజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 277.88 కోట్లను బోనస్ ( నెట్ రెవెన్యూ) చెల్లింపు ప్రక్రియ ప్రారంభించాం అని తెలిపారు. లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే బోనస్ డబ్బులు జమ చేస్తామని మంత్రి తెలిపారు. అదే విధంగా తునికాకు సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సీజన్ లో 2.27 లక్షల స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించి, అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు.ఈ సీజన్ లో దాదాపుగా 75 వేల మంది తునికాకు సేకరణలో కార్యక్రమంలో పాల్గొంటారు.
2023వ సంవత్సరం తునికాకు సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో 225 యూనిట్లలో తునికాకును అటవీ అభివృద్ధి సంస్థ (F.D.C) ఆద్వర్యంలో అటవీ శాఖ విక్రయిస్తుంది. సిర్పూర్ నియోజకవర్గంలో తునికాకు కూలీలకు రూ. 31.58 కోట్ల బోనస్ ను చెల్లించే పక్రియను ఇవాళ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాము. కుమురం భీం – ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 63,573 మంది లబ్దిదారులకు రూ.31.58 కోట్లు చెల్లిస్తుండగా, , ఒక్క సిర్పూర్ నియోజకవర్గంలోనే 48,418 మంది లబ్ధిదారులకు రూ.26.98 కోట్లు చెల్లిస్తున్నార అని మంత్రి వెల్లడించారు.