సెప్టెంబరు 19 నుండి జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది.
అధిక మాసం కావడంతో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి వస్తున్నది. అక్టోబర్ లో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి ఏ విధంగా నిర్ణయించాలనే అంశాన్ని నిర్ణయిస్తారు. నేడు జరిగిన పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి కీర్తిని నలుదిక్కులా వ్యాప్తి చేసే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ముంబయిలో దేవాలయం నిర్మాణానికి తర్వలో శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు.
అదే విధంగా వారణాసిలో వేంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వాన్ని స్థలం కేటాయించాలని కోరినట్లు ఆయన వివరించారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆలయ నిర్మాణం చేపడుతామని ఆయన తెలిపారు.
వైజాగ్ లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత అక్కడ మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
రూ.4.95 కోట్లతో వైజాగ్ శ్రీవారి ఆలయంకు ఘాట్ రోడ్ల నిర్మాణంకు చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు.