తిరుమల కొండపై ఏం జరుగుతుంది? ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి అపసృతులు ఎందుకు జరుగుతున్నాయి? మఠాధిపతులు, పీఠాధిపతులు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎందుకు నోరు మెదపడం లేదు? అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అలిపిరి నడక దారిలో 2 నెలల వ్యవధిలో రెండవ సంఘటన హృదయ విదారకం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిటింగ్ జడ్జి ద్వారా నిజనిర్ధారణ కమిటీని వేసి సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.
నెల్లూరు జిల్లా నుంచి కుటుంబంతో వచ్చిన లక్షిత 6 సం” పసిబిడ్డ అడవి జంతువుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంది దీనికి బాధ్యులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. టిటిడి ఉన్నతాధికారుల కార్యాలయాల వద్ద బంగ్లాల వద్ద అధిక సంఖ్యలో ఉండే సెక్యూరిటీ గార్డ్స్ ను వెంటనే అక్కడి నుంచి తొలగించి భక్తులకు రక్షణ కల్పించడానికి వినియోగించాలి.
తిరుమల కొండ పై దీర్ఘకాలికంగా తిష్ట వేసి ఉన్నత స్థాయి అధికారులకు వారి మంది మార్బలానికి దర్శనాలు చేయించుకుంటూ భక్తుల భద్రతను,ఉద్యోగ ధర్మాన్ని గాలికి వదిలేసి పనిచేస్తున్న అన్ని శాఖలలోని అధికారులను బదిలీలు చేయండి.
అలిపిరి నడక మార్గంలో జరుగుతున్న వరుస సంఘటనలతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది. తిరుమల శ్రీవారి నిధులను మంచి నీళ్లలా ఖర్చు చేసే టీటీడి ఉన్నతాధికారులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో ఎందుకు ఖర్చు పెట్టకుండా రాజీ పడుతున్నారు.
అలిపిరి,శ్రీవారిమెట్టు నడక మార్గాలకు ఇరువైపులా (కంచె) ఫెన్సింగ్ వెయ్యాలి,ప్రతి కిలోమీటర్ కి “ఐదు మంది సెక్యూరిటీ గార్డ్స్” ఏర్పాటు చేయాలి “ఎయిర్ గన్స్” ఏర్పాటు చేసి ప్రతి పది నిమిషాలకు ఒకసారి శబ్దం వచ్చేలా చర్యలు చేపట్టి సాయంత్రం 7 గంటలకల్లా రెండు నడకమార్గాలలో భక్తుల రాకపోకలను పూర్తిగా నిషేధించాలన్నారు.