ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 66 వ పుట్టిన రోజు సందర్భంగా నగర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కార్పొరేటర్లకు మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని 150 వార్డులలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి, సంరక్షించే చర్యలను చేపట్టడం పుట్టినరోజు కానుకగా భావించాలని తెలిపారు. రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు పిలుపును స్ఫూర్తిగా తీసుకొని రెండున్నర లక్షల మొక్కలను నాటేందుకు, పంపిణీ చేసేందుకు నగర పరిధిలోని 36 నర్సరీలలో ఉన్న మొక్కలను ఆయా వార్డులలో ఉన్న పార్కులు, కూడళ్లలో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
మొక్కల పట్ల ముఖ్యమంత్రి కె.సి.ఆర్కు ఉన్న ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకొని కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరూ స్వచ్ఛందంగా తెలంగాణకు హరితహారంలో పాల్గొనాలని కోరారు. మొక్కలను నాటడమే కాక వాటి పరిరక్షణకు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను బ్రతికించేందుకు చర్యలు తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి పుట్టినరోజు కానుకకు సార్థకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను తెలంగాణకు హరితహారం కార్యక్రమంగా నిర్వహించాలని కోరారు. నర్సరీలు, కూడళ్లలో అందుబాటులో ఉంచిన మొక్కలను సమీపంలోని పార్కులు, రోడ్లకు ఇరువైపులా, సెంట్రల్ మీడియంలలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో నాటాలని తెలిపారు. అలాగే అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలలో నాటేందుకు పంపిణీ చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ప్రతి మొక్కను సక్రమంగా నాటి, బ్రతికించాలని మేయర్ కోరారు.