చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు: విజయనగరం వన్ ఇన్స్పెక్టర్ డా.బి.వెంకటరావు వెల్లడి
విజయనగరం ప్రదీప్ నగర్ లో అక్టోబరు 10న ఒక మహిళ మెడలో మంగళ సూత్రం త్రెంపుకొని పోయిన కేసులో ఇద్దరు నిందితులను విజయనగరం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసారు. విజయనగరం వన్ టౌన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు మాట్లాడుతూ విజయనగరం ప్రదీప్ నగర్ లోని శారద అపార్టుమెంటులో వాచ్ వుమన్ గా పని చేస్తున్న ఉడిగల గౌరి (45 సం.లు) అనే మహిళ అక్టోబరు 10న, సాయంత్రం 3-45 గంటల సమయంలో ఇస్త్రీ చేసిన బట్టలను దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళి ఇచ్చేందుకు వెళ్ళుతుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలుపై వచ్చి, మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తుల త్రాడును త్రెంపుకొని, మోటారు సైకిలుపై పరారయ్యారు.
ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ పోలీసులు ఫిర్యాదిని విచారణ చేసి, కొన్ని ఆధారాలను సేకరించారు. వన్ టౌన్ పోలీసులకు వచ్చిన సమాచారంపై విజయనగరం గూడ్సు షెడ్ వద్ద అక్టోబరు 13న వన్ టౌన్ ఎస్ఐ వి.అశోక్ కుమార్, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టి, ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలుపై వస్తుండగా అదుపులోకి తీసుకొని, విచారణ చేసారు. విచారణలో నిందితులు (ఎ-1) భీమిలి మండలం వలదపేట గ్రామానికి చెందిన కోనాడ రాంబాబు (28 సం.లు) (ఎ-2) విజయనగరం కమ్మవీధికి చెందిన బేతా లల్లూ (19 సం.లు) అనే ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి చైన్ స్నాచింగుకు పాల్పడిన రెండు తులాల పుస్తుల త్రాడు, 4 కిలోల గంజాయి, ఒక మోటారు సైకిలును, ఒక హెల్మెట్ ను రికవరీ చేసి, రెండు కేసుల్లో నిందితులను రిమాండుకు తరలించినట్లుగా వన్ టౌన్ ఇన్స్పెక్టరు బి. వెంకటరావు తెలిపారు.
నిందితులకు గంజాయిని సేవించే అలవాటు ఉన్నట్లు, గంజాయిని తరలించే క్రమంలో పట్టుబడినట్లుగా విచారణలో అంగీకరించారని సిఐ డా బి. వెంకటరావు అన్నారు. ఈ కేసును చేధించుటలో వన్ టౌన్ ఎస్ఐ వి. అశోక్ కుమార్, హెచ్.సి. ఎం. అచ్చిరాజు, కానిస్టేబుళ్లు టి.శ్రీనివాస్, బి. శివ, బి. శంకరరావు, ఎన్.గౌరీ శంకర్ క్రియాశీలకంగా పని చేసారని, వారిని అభినందించారు.