కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరు గ్రామ శివారులో తెల్లవారు జామున సుమారు 2 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మద్యం మత్తులో బైక్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు నడచి వెళ్తుతున్న ఒకరిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
ప్రకాశం జిల్లా కు చెందిన లారీ డ్రైవర్ ఎడ్లంపల్లి వెంకటేశ్వర్లు అల్గునూరు గ్రామ శివారులోని యూనియన్ బ్యాంకు ఎదురుగా నడిచి వెళ్తూ రోడ్డు దాటుతుండగా బాగా తాగి ఉన్న ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి ఢీకొట్టారు. దాంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మరణించాడు.
బైక్ పైనున్న ముగ్గురిలో మొహ్మద్ సల్మాన్ (22) కూడా అక్కడే మరణించాడు. సల్మాన్ కరీంనగర్ కట్టరాంపూర్ కు చెందిన యువకుడు. బైక్ పైన ఉన్న మరో ఇద్దరు యువకులు మొహ్మద్ మన్సూర్ (24), మహానంది కైలాష్ (28) తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో మన్సూర్ బైక్ నడుపుతున్నాడు.
ఈ ముగ్గురు యువకులు మద్యం సేవించడానికి కరీంనగర్ నుండి సదాశివపల్లికి వెళ్లి తిరిగి కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో యువకులు మద్యం మత్తులో బైక్ నడపడం, హెల్మెట్ ధరించక పోవడం, మితిమీరిన వేగం, త్రిబుల్ రైడింగ్ ప్రమాదానికి కారణాలు అని పోలీసులు స్థానికులు అంటున్నారు.
సంఘటన స్థలానికి ఎస్సై కృష్ణారెడ్డి కి చేరుకొని గాయపడ్డ వారిని, మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిమ్మాపూర్ సిఐ మహేష్ గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.