భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. 6న బంద్ పేరుతో మావోయిస్టులు విధ్వంసానికి తలపెట్టినట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు జరుపుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
అంజిపల్లి వడ్డీ పేట పరిధిలో పోలీసులకు మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మరణించారని పోలీసులు తెలిపారు. కొన్ని మావోయిస్ట్ బృందాలు చర్ల ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి, ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టడానికి సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి తెలిపారు.
చర్ల ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువగా సంచరించే అనుమానిత ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించామని ఆయన తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పూసుగుప్ప అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీలకు, మావోయిస్టులకు సుమారుగా 20 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. అనంతరం కాల్పులు జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించామని ఆయన తెలిపారు.
అంతేకాకుండా ఆ ప్రదేశంలో 01 SBBL తుపాకీ,01 పిస్టల్, రెండు కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని, కాల్పులు జరిగిన ప్రదేశంలో ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.