26 బొబ్బిలి, 30 వతేదీన విజయనగరంలో ఉత్సవాలకు ఏర్పాట్లు
భారతదేశ 75వ స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విద్యుత్ రంగంలో దేశం సాధించిన విజయాలను, ప్రగతిని మననం చేసుకొని, 2047 నాటికి వందేళ్ల కాలంలో సాధించాల్సిన లక్ష్యాలు, ప్రగతిపై చర్చించేందుకు ఉజ్జ్వల భారత్ – ఉజ్జ్వల భవిష్యత్ పేరుతో జూలై నెలలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి తెలిపారు.
ఈ రంగంలో గత 8 ఏళ్ల కాలంలో దేశం సాధించిన ప్రగతిని, పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన ప్రగతిని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించేలా, ప్రజలకు అవగాహన కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సూచనల మేరకు దేశంలోని 773 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మన జిల్లాలో ఎన్.టి.పి.సి.(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్- సింహాద్రి యూనిట్)తో కలసి జిల్లా యంత్రాంగం జూలై 26న బొబ్బిలి డివిజన్ కేంద్రంలోనూ, 30న విజయనగరంలోనూ ఈ ఉత్సవాలు జరిపేందుకు నిర్ణయించడం జరిగిందని పేర్కొన్నారు.
రైతులు, విద్యార్ధులు, విద్యుత్ వినియోగదారులు తదితర వర్గాల వారు విద్యుత్ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. దీనిలో భాగంగా విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి, విద్యుత్ అవసరాలు, సహజ ఇంధన వనరుల వినియోగం అంశాలపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
గ్రామాల విద్యుదీకరణ, గృహ విద్యుత్, విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెంపుదల, ఒకే దేశం – ఒకే గ్రిడ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడం, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో సాధించిన అసామాన్య ప్రగతి, వినియోగదారుల హక్కులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రాంతీయ భాషల్లో రూపొందించిన తక్కువ నిడివిగల షార్టు ఫిల్మ్లు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించనున్నట్టు పేర్కొన్నారు. జూలై 31న జాతీయ స్థాయిలో నిర్వహించే ఉత్సవంలో దేశ ప్రధాని మోడీ పాల్గొంటారని వివరించారు. పీఎం మోడీ దేశంలోని ఐదు ప్రదేశాల్లోని విద్యుత్ వినియోగదారులతో దూరదృశ్య మాధ్యమం ద్వారా సంభాషిస్తారని తెలిపారు.