వచ్చే నెల 15 నుంచి సినిమా ధియేటర్లను ప్రారంభించుకోవచ్చు. ఈ మేరకు కేంద్రం కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో 5వ దశ లాక్ డౌన్ మినహాయింపులు ప్రకటించింది.
అక్టోబర్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. సినిమా హాళ్ల విషయానికి వస్తే అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీట్ల సామర్థ్యంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.
అదే విధంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్ పూల్లకు కూడా అనుమతి ఇచ్చారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల పునఃప్రారంభానికి కేంద్రం వెసులుబాటు కల్పించింది.
అక్టోబర్ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి దశలవారీగా పాఠశాలల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చారు. అయితే ఆన్లైన్ బోధన విధానం, దూరవిద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆన్లైన తరగతులకు విద్యార్థులు మొగ్గు చూపితే పాఠశాలలు అనుమతించవచ్చు. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితోనే పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశం కల్పిస్తారు.