కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ నెల 26వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, ఈ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. కేంద్రమంత్రి పర్యటనకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై, కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ రాత్రికే కేంద్ర మంత్రి జిల్లాకు చేరుకుంటారని తెలిపారు. 26వ తేదీన జిల్లాలో విస్తృతంగా పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఆరోజు ఉదయం గుంకలాంలోని జగనన్న కాలనీని సందర్శించి, ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తారని తెలిపారు. నెల్లిమర్ల మండలం గొర్లిపేట వద్ద చేపట్టిన నాడూ-నేడు పనులను పరిశీలించిన అనంతరం, రామతీర్ధంలోని శ్రీ సీతారామస్వామి వారి ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు.
కుమిలిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయ భవనాలను పరిశీలిస్తారని, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. జిల్లాలో నీతి అయోగ్ కార్యక్రమం అమలు, లక్ష్యాల సాధనపైనా, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపైనా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపారు.కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లను చేయడంతోపాటు, సమీక్షా సమావేశానికి అధికారులు సిద్దం కావాలని కలెక్టర్ ఆదేశించారు.
దీనికి అవసరమైన అన్ని రకాల నివేదికలను తయారు చేయాలన్నారు. వివిధ పథకాల క్రింద కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సిన నిధులుపై సమగ్ర నివేదికలను తయారు చేయాలని సూచించారు. జిల్లాలో పథకాల అమలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్దం చేయాలన్నారు.
ప్రగతిని వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు, జరిగిన లబ్దిని వివరించాలన్నారు. విద్యకు సంబంధించి నాడూ నేడు ప్రగతిని వివరించాలని చెప్పారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మౌలిక వసతులు, ఇతర పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. కేంద్ర మంత్రి జిల్లా పర్యటనను పూర్తిగా సద్వినియోగం చేసుకొనే విధంగా అన్నివిధాలా అధికారులంతా సంసిద్దులు కావాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, సిపిఓ పి.మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.