కడప జిల్లా వేముల మండలం లో జరుగబోయే ఓ బాల్య వివాహాన్ని ముందస్తుగా గుర్తించి పోలీసు అధికారులను అప్రమత్తం చేసి బాలిక బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన గ్రామ మహిళా పోలీసు తో పాటు, స్కూల్ మానేసిన చిన్నారిని మళ్ళీ స్కూల్ కు వెళ్లేలా చేసిన మహిళా పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ప్రత్యేకంగా అభినందించారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళా పోలీసులను జిల్లా ఎస్.పి అభినందించి ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ అంకిత భావంతో, సమయ స్పూర్తితో విధులు నిర్వహించి ఆయా గ్రామ ప్రజల మన్ననలు అందుకున్నారని ప్రశంసించారు.
సకాలంలో గుర్తించడంతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేశారని అభినందించారు. మున్ముందు ఇదే స్ఫూర్తిని ప్రదర్శించి పోలీసు శాఖ ఔన్నత్యాన్ని పెంపొందించాలని జిల్లా ఎస్.పి ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్.పి తెలిపారు.
ప్రశంసా పత్రాలు అందుకున్నవారిలో బాల్య వివాహాన్ని జరగకుండా నిరోధించిన వేముల మండలం వి.కొత్తపల్లి సచివాలయ మహిళా పోలీసు కెవసంత లక్ష్మి, అట్లూరు మండలం లో 9 వ తరగతి చదువుతూ స్కూల్ మానేసిన ఓ బాలికను, ఎం.చరణ్ అనే 8 వ తరగతి చదివే విద్యార్థిని మళ్ళీ స్కూల్ కు వెళ్లేలా కృషి చేసి వారి బంగారు భవితకు బాటలు వేసిన తంబళ్ళగొంది పంచాయతీ మహిళా పోలీసు యు.అనూష తో పాటు మహిళల రక్షణకు కృషి చేసిన చిన్నచౌకు కొండాయ పల్లి -2 మహిళా పోలీసు కె.సరితా కుమారి ఉన్నారు. కార్యక్రమంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి ఆర్.వాసుదేవన్ పాల్గొన్నారు.