కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంతో బాటు భవిష్యత్తు కూడా అంధకారంగా మారబోతున్నట్లు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో ఆహార పదార్ధాల రవాణా పూర్తిగా నిలిచిపోయింది.
ఇది రానున్న రోజుల్లో పెను ప్రమాదానికి దారితీయబోతున్నదని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ సాటి వారికి ఆహార ధాన్యాలు ఎగుమతి చేయడమో, కావాల్సినవి దిగుమతి చేసుకోవడమూ చేస్తుంటారు.
లాక్ డౌన్ కారణంగా ఆహార ధాన్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్ మొత్తం ఇప్పుడు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అవసరమైన వారికి చేరడం ఆగిపోయింది. ప్రముఖ ఆహార ఉత్పత్తిదారులను లాక్ డౌన్ చేయడం, వారి ఎగుమతులు నిలిపివేయడం వల్ల సంక్షోభం ఏర్పడింది.
ఐక్యరాజ్యసమితి పేద దేశాల్లోని 87 మిలియన్ల మందికి నేరుగా ఆహార ధాన్యాలు అందించేది. పేదరికంతో బాధపడుతున్న ఈ ప్రాంతాల్లో కోవిడ్ తెగులు రావడంతో, యుఎన్ ధాన్యం సరఫరాను పొందలేకపోయింది. మూడు నెలలు తగినంత ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంటేనే చాలా పేద దేశాలలో ఆకలి మరణాలను నివారించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ దశలో కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సేకరించాల్సిన అవసరం ఉందని అంచనా. కానీ ప్రస్తుత సందర్భంలో ఈ లక్ష్యం అంత సులభం కాదు. కరోనా నేపథ్యంలో అనేక దేశాలు దేశీయ అవసరాలకు బియ్యం, గోధుమలను నిల్వ చేసుకుంటూ ఎగుమతి చేయడం మానేశాయి.
ఈ విధానం వల్ల రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అతిపెద్ద ఉద్యోగ నష్టం, ఆకలి ప్రపంచం ఏర్పడబోతున్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.