కరీంనగర్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయడంతోపాటు షిరిడీ, ముంబయి, చెన్నయ్ వంటి ప్రాంతాలకు రైళ్లను నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇండియన్ రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో సీఈవో సునీత్ శర్మలను కోరారు. ఈ మేరకు వారికి వినతి పత్రం అందజేశారు.
అందులోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
కరీంనగర్ పట్టణంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు దాటడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని తక్షణమే రైల్వే క్రాసింగ్ లైన్ ను తొలగించి ఆర్వోబీ ని నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే నుండి ఇప్పటికే ఇండియన్ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు అందాయని. తక్షణమే దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి మంజూరు చేయాలన్నారు.
రామడుగు వద్దనున్న ఎల్సీ నెం.26 రైల్వే గేటును తొలగించి ఆ స్థానంలో రోడ్ అండర్ బ్రిడ్జీ లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జీ నిర్మించేందుకు తగిన పనులు మంజూరు చేయాలన్నారు.కరీంనగర్ వాణిజ్య పరంగా అభివ్రుద్ది చెందుతున్న పట్ణణం. కరీంనగర్ ను టెర్మినల్ స్టేషన్ గా అభివృధ్ధి చేయాలని. ఇక్కడి నుండి ముంబయి, షిరిడీ, చెన్నయ్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంటుందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు వెంటనే రైళ్లను నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే కరీంనగర్-నిజామాబబాద్ సెక్షన్లో మరిన్ని రైళ్లను నడపడానికి కాజీపేట ఎండ్ నుండి పెద్దపల్లి వద్ద బైపాస్ లైన్ పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే సర్వే పనులు కూడా పూర్తి చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే తగిన నిధులు మంజూరు చేయాలన్నారు.
మనోహరాబాద్ నుండి కొత్తపల్లి వరకు కొత్త లైన్ నిర్మాణ పనుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 325 కోట్ల నిధులు కేటాయించబడ్డాయన్నారు. అయితే ఈ నిర్మాణ పనులు నత్తనడకతో సాగుతున్నాయన్నారు. ఇలాగే కొనసాగితే 2023లోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని చేరుకోలేమని ఎంపీ తెలియజేసారు. ఈ లైన్ నేరుగా రాజధానికి కనెక్టు అవుతున్నందున పనులను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరారు.
కరీంనగర్ రైల్వే స్టేషన్ సౌకర్యాలను అప్-గ్రేడేషన్ చేయాలి. స్టేషన్ లో లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ సదుపాయం కల్పించాలన్నారు. రైల్వే స్టేషన్కు రెండవ ప్రవేశ ద్వారాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్ స్టేషన్లో లోడింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు.
కరీంనగర్ నుండి హుజురాబాద్ మీదుగా హసన్పర్తి వరకు కొత్త లైన్ నిర్మాణం కోసం సర్వే పనులు చాలా ఏళ్ల క్రితమే మంజూరైనప్పటికీ తగిన నిధులు కేటాయించలేదని ఎంపీ అన్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంపట్ల ఈ ప్రాంత ప్రజలకు భారీ అంచనాలున్నాయన్నారు. అయితే వారు ఆశించినట్లుగా ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. తదుపరి సప్లిమెంటరీ బడ్జెట్ లోనైనా తగిన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.