ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకుండా జాప్యం చేస్తున్నారని, నియోజకవర్గంపై స్థానిక ఎమ్మెల్యేకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పరిష్కరిస్తే వారం రోజుల్లో నా కార్యకర్తలతో కలిసి సన్మానం చేస్తానని ఉప్పల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు ఏమీ ఉద్ధరించారని పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. మల్లాపూర్ డ్రైనేజి సమస్యలతో సతమతమవుతున్న పట్టించుకోకుండా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామనే మాటలతో గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు.
చిలకనగర్ లో, చెరువుల సుందరీకరణ, బఫర్ జోన్ పరిస్థితి పరిష్కారం ఏమైంది..? సర్వే నెంబర్ లు ,793, 51 ప్రభుత్వ భూముల పరిస్థితి, ఇల్లు లేని పేదవారుకి డబల్ బెడ్ రూమ్ పరిస్థితి, స్మశాన వాటికల సుందరీకరణ, ఏమైందని ప్రశ్నించారు. ఇంత ప్రభుత్వ భూమి ఉన్నా, కనీసం మేడ్చల్ మల్కాజిగిరి కోర్ట్ కి కూడా స్థలం కేటాయించలేకపోయారని, కనీస బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారని అన్నారు. చిలకనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారనీ ఇలా చేయడం దారుణమైన దుశ్చర్య అని వెంటనే విద్యార్థులు చదువుకోవడం కొరకు పాఠశాలకు విద్యుత్ సరఫరాని పునరుద్ధరించాలని అన్నారు.
అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహించకుండా ప్రభుత్వ ఖజానాకు ఆటంకం కలగకుండా చూడాలని అన్నారు. స్థానిక నియోజకవర్గ పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఆలోచన చేయాలని ఎమ్మెల్యే ని అభ్యర్ధించారు. నియోజకవర్గంలో ఓటు వేసి గెలిపించుకున్న ప్రజలకు అభివృద్ధి చేసి చూపించి గౌరవ మర్యాదలు కాపాడుకోవాలని లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాగిడి హెచ్చరించారు.