పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రజలకు కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. బాలికల విద్యను ప్రోత్సహిస్తూ 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతి బాలికకు 20 వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనితో పాటు, బాలికలకు తదుపరి చదువుల కోసం కంప్యూటర్లు, టాబ్లెట్లు కూడా ఇస్తామని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రజలను ఆకట్టుకునేందుకు, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కంటే ముందే రాష్ట్రంలో వాగ్దానాల పర్వం చేసింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పెద్ద వాగ్దానాలు చేసింది. పంజాబ్లో బాలికల విద్యతో పాటు, మహిళల కోసం కూడా కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తోంది.
ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటన చేస్తూ.. 5, 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి బాలికకు పార్టీ తరుఫున రూ.5 వేలు, 15 వేల రూపాయలు ఇస్తుందని ప్రకటించారు. అదే సమయంలో 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 20 వేల రూపాయలు అందజేస్తామన్నారు.
దీంతో పాటు తదుపరి చదువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు కూడా అందిస్తామని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, మహిళలకు నెలకు రూ. 2 వేలు, ఏడాదికి 8 సిలెండర్లు ఇస్తామని ప్రకటించారు.