తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్ ఛార్జి ఉపకులపతిగా ప్రస్తుత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఉన్నత విద్యాశాఖ ఇన్ ఛార్జి కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ గుప్తా ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. గత నెల రోజులుగా వీసీ పోస్టు ఖాళీగా ఉండడంతో విశ్వవిద్యాలయంలో కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వీసీ నియామకంపై ప్రభుత్వం తర్జనభర్జన పడిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా నియమించబడిన నిజామాబాద్కు చెందిన ప్రొఫెసర్ లింబాద్రిని ఇన్ ఛార్జి వీసీగా నియమిస్తారని ప్రచారం జరిగిన అది కార్యరూపం దాల్చలేదు.
ఎట్టకేలకు ఐఏఎస్ నియమిస్తారని జరిగిన ప్రచారంలో భాగంగానే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇన్ ఛార్జి కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కేసులో జైలుకు వెళ్లిన రవీంద్ర గుప్తకు గురువారం బెయిల్ మంజూరు కాగా ఆయన జైలు నుంచి విడుదలైన రోజు యూనివర్సిటీకి ఇన్ ఛార్జి వీసీని నియమించడం చర్చనీయాంశంగా మారింది.