కేంద్రహోంమంత్రి అమిత్ షాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితులను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.
నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆయన కీలక ఆరోపణలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
దీంతో రఘురామపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత రఘురామ బెయిల్పై బయటకు వచ్చారు. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి.
రఘురామపై అనర్హత వేయాలని వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా… రఘురామకు లేఖ రాశారు. వైసీపీ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరారు. తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు. ‘‘నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్లో చాటింగ్ బయట పెట్టామని అంటున్నారు.. నా ఫోన్ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్ సాఫ్ట్వేర్ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?’’ అని రఘురామ ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్రమంత్రి అమిషాను రఘురామ కలిశారు. పలు అంశాలపై చర్చిస్తున్నారు ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది.