అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురం గ్రామంలో భవఘ్ని ఆరామం ఆధ్వర్యంలో భగవాన్ వేద వ్యాస ఆలయంలో నిర్వహించిన వేదవ్యాస మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతిష్ఠితమైన వేదవ్యాస మహర్షి ప్రతిమకు నమస్కారం చేసి,భవగ్నిగురువు నుండి ఆశీర్వాదాలు స్వీకరించారు.
వేదవ్యాస మహర్షి గొప్పదనాన్ని,ఆయన ప్రతిమను వైకుంఠపురంలో ప్రతిష్టించడానికి గల కారణాలను ఆరామ గురువులు ఎస్పీకి వివరించారు. తదనంతరం వేదవ్యాస మహర్షి ప్రతిమను, ఆలయాన్ని, పరిసరాలను, భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.
హిందువులకు ఎంతో పవిత్రమైన మహాభారత గ్రంధాన్ని తన ప్రతిభా పాఠవాలను ఇనుమడింపజేసి సంస్కృతంలో రచించిన గొప్ప మహాకవి వ్యాసమహర్షి అని ఎస్పీ తెలిపారు. అదే విధంగా కలగాపులంగా ఉన్న వేదాలను ఒక క్రమపద్ధతిలో సమకూర్చి,సామాన్యుడు సైతం అర్ధం చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారని ఆ వేదవ్యాస మహర్షి గొప్పతనం గురించి మన పూర్వీకులు పుంఖానుపుంఖాలుగా చెప్పుకుంటూ ఉండేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అటువంటి ఆ గొప్ప మహర్షి ప్రతిమను మన జిల్లాలో ప్రతిష్టించడం గొప్పవిషయమని,నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని తెలిపారు. మహర్షిని దర్శించేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం భవగ్ని ఆరామం వారు చేసిన ఏర్పాట్లు ఆసాంతం కన్నులపండువగా ఉన్నాయని,వారికి నా అభినందనలు తెలుపుతున్నాను అని తెలిపారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి వేదవ్యాస మహర్షి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసిన ఎస్పీని ఆరామం వారు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు సత్తెనపల్లి డిఎస్పీ ఆదినారాయణ,అమరావతి సీఐ శివప్రసాద్,ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.