జిల్లా మంత్రుల సలహాలు, సూచనలతో జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలను చేపట్టాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలెక్టర్లను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లాలలో కోవిడ్ మేనేజ్ మెంట్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ లతో గురువారం బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్ గా మానిటర్ చేయాలని డాక్టర్లతో తగు కౌన్సిలింగ్ ను అందించాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.
పేషెంట్లందరికి అవసరమైన చికిత్స అందించి వారిలో భరోసా కల్పించాలని అన్నారు. సోమేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలలో టెస్టింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టింగ్ చేయడంతో పాటు ఆప్ లో తప్పని సరిగా వివరాలు నమోదు చేయాలన్నారు. పాజిటివ్ పేషెంట్లకు కౌన్సిలింగ్ తో పాటు మెడికల్ కిట్ ను అందిజేయాలన్నారు.
కొత్త టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్రం రెడీ
కొత్త టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కోవిడ్ చికిత్సకు అవసరమైన వైద్యులు, మెడికల్ సిబ్బందికి తాత్కాలిక పద్దతిలో నియమించడానికి అవసరమైన ప్రతిపాదిస్తే అనుమతులు ఇస్తామన్నారు.
కోవిడ్ చికిత్సకు దరఖాస్తులు చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు , ప్రభుత్వ మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులలో ఉన్న అన్ని బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం కల్పించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
కోవిడ్ చికిత్సకు సంబంధింత పెండింగ్ బిల్లులు తగు ప్రొఫార్మాలో సమర్పించాలన్నారు. ఐసోలేషన్ కిట్లు అందజేసే మందుల వివరాలకు సంబంధించి సర్కూలర్ ను రూపొందించాలని కోవిడ్ కు సంబంధించిన ట్రీట్ మెంట్ ప్రోటో కాల్ పై నిబంధనలు రూపొందించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కమీషనర్ కుటుంబ సంక్షేమ శాఖ కరుణ, పి.సి.బి. మెంబర్ సెక్రటరీ నీతూ ప్రసాద్, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.