ఇత్తడిని పుత్తడి గా చేసి ఓ ఘరానా మోసానికి పాల్పడ్డ నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ మేరకు రూరల్ సర్కిల్ ఆఫీసులో ఏఎస్పీ, విజయనగరం ఇంచార్జి డీఎస్పీ అనిల్ మీడియా కు ఈ విషయాన్ని తెలియచేసారు. రాష్ట్రంలో ని తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం కన్నయ్యపేటకు చెందిన మహంతి సీతారామరాజు అనే వ్యక్తి మహిమగల చెంబును ఇస్తానని నిందితులను నమ్మించడంతో, వారు కొంత నగదును ఫిర్యాదు దారునికి ఇచ్చినారు. కానీ, ఫిర్యాదు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిందితులకు మహిమగల చెంబును గానీ, తీసుకున్న డబ్బులు గానీ ఇవ్వకపోవడంతో నిందితులు ఒక పథకం ప్రకారం ఏలేశ్వరం వెళ్ళి మార్చి 27న ఒక వివాహ వేడుకలో ఉన్న ఫిర్యాదిని కిడ్నాప్ చేసి, 12 రోజులపాటు పిఠాపురం, అనకాపల్లి, ఎస్.కోట త్రిప్పి డబ్బుల కోసం హింసించి, చివరగా తాటిపూడి సాల్సాన్ రిట్రీట్ వద్ద నిర్బంధించారు. ఫిర్యాది కుటుంబ సభ్యులు ద్వారా విషయం తెలుసుకున్న గంట్యాడ పోలీసులు మెరుపు దాడి చేసి, గాయాలతో ఉన్న రక్షించి, 5గురు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసు నిందితులను పట్టుకోవడంలో క్రియాశీలకంగా పని చేసిన రూరల్ సీఐ టి.ఎస్.మంగ వేణి, ఎస్ఐ లు కిరణ్ కుమార్, నారాయణ రావు మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక, అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి అభినందించారు.