లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ, టీవీ కార్మికులను ఆదుకునేందుకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనవంతు సాయంగా 14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాల సరుకులను పంపిణీ చేశారు.
గురువారం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ ,రాధాకృష్ణ, రామ్ మోహనరావు , తలసాని సాయి, ఎన్.శంకర్, సి.కళ్యాణ్, అభిషేక్, కాదంబరి కిరణ్ తదితరుల సమక్షంలో కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు.
14 వేల నిత్యావసర వస్తువులలో 12 వేల మంది సినీ , 2 వేల మంది టీవి కార్శికుల కు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గత 2 నెలలుగా లాక్ డౌన్ అమలులో ఉండటం వలన పేద ప్రజలు, వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం 12 కిలోల బియ్యం, 1500 రూపాయలను అందించిన విషయాన్ని గుర్తుచేశారు.
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా సినీ, టీవీ కార్మికులకు ఈ విపత్కర పరిస్థితులలో తనవంతు చేయూతగా నిత్యావసర వస్తువులను అందించినట్లు చెప్పారు.