మరింత సుందరీకరణగా మలచాలని అధికారులకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆదేశాలు
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు హాయంలో హైదరాబాద్ హైటెక్స్ లో నిర్మించిన మాదిరిగానే…ప్రస్తుతం ఏపీ లోని అదీ విద్యలనగరంగా ఖ్యాతి పొందిన విజయనగరంలోని నల్ల చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం శిల్పారామాన్ని జూన్ 1వ తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి పర్యాటక శాఖ, శిల్పారామం అధికారులను ఆదేశించారు.
పచ్చని చెట్లు, నీటి కొలను, ఓపెన్ ఆడిటోరియం, సుందరమైన పార్కు ఆకట్టుకునేలా ఉన్నాయని.. వాటికి అదనంగా విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసి మరింత సుందరీకరణగా మలచాలని సూచించారు.ఈ మేరకు పర్యాటక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, శిల్పారామం ఏవో రమణలతో కలిసి కలెక్టర్ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు.
జూన్ ఒకటో తారీఖు అట్టహాసంగా అందుబాటులోకి తీసుకొచ్చి పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలు, మామిడి పళ్లు ప్రదర్శనలో పెట్టాలని సూచించారు.పర్యాటకుల సౌకర్యార్థం తాగునీరు సదుపాయం కల్పించాలని, కూర్చునేందుకు అనుగుణంగా బల్లలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
వాహనాల పార్కింగ్ కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంట్రీ ఫీజు వసూలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. అలాగే పట్టణం నుంచి శిల్పారామం చేరుకునే రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.కలెక్టర్ వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, శిల్పారామం ఏవో రమణ, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు.