కరోనా కట్టడిని విజయనగరం జిల్లా పోలీసులు.. ఎస్పీ ఆదేశాలు, సూచనలతో పటిష్టం గా అమలు పరుస్తున్నారు. ఈ క్రమంలో నే కర్ఫ్యూ సడలింపు సమయం ముగిసిన రోడ్ల పై ఉన్న మహిళలు స్వయంగా ఎస్పీ రాజకుమారికి తారసపడ్డారు.
తమ వారి తాలుక పెళ్లి ఈ నెల 26న ఉందని సామాన్లు కొనేందుకు వచ్చామని ఎస్పీకి తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో నగరంలో గంటస్థంభం వద్ద ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఆ పెళ్లి బృందం ఉండటంతో ప్రశ్నించారు. తామంతా ప్రత్యేకించి ఓ ఆటోలో వచ్చామని..తిరిగి అదే ఆటోలో తిరిగి వెళ్లిపోతామని ఆ బృందం ఎస్పీకి చెప్పారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కర్ఫ్యూ అమలు తీరునుపర్యవేక్షించేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ నగర లోని పలు ప్రాంతాలను సందర్శించారు. నగరం లోని ఆర్టీసి కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కోట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట రైతు బజారు, మూడు లాంతర్లు, గంట స్థంభం ప్రాంతాలను సందర్శించారు.
కర్ఫ్యూ నిబంధనలు మేరకు మద్యాహ్నం 2 గంటలలోపల వ్యాపార సంస్థలు, సముదాయలను స్వచ్చందంగా మూసివేయాలన్నారు. కరోనా నియంత్రణకే కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు.
మరికొద్ది రోజులు కరోనా నియంత్రణకు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తే వ్యాధి వ్యాప్తిని మరింత తగ్గించవచ్చునన్నారు. కేసుల నమోదు సంఖ్య ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు.
మద్యాహ్నం 2గంటల తరువాత బయటకు వచ్చే వాహనదారుల వాహనాలను నిలిపివేయాలని, అనుమతులు ఉన్నాయో? లేవో? పరిశీలించాలని, అనుమతులు లేని వాహనాలను నిలిపివేయాలని పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ప్రస్తుతం కరోనా ప్రభావం దృష్ట్యా ప్రతీ ఒక్కరూ సోషల్ డిస్టన్స్ పాటించే విధంగాను, డబుల్ మాస్క్ ధరించే విధంగాను, కరోనా నిబంధనలు పాటించే విధంగా చూడాలని పోలీసు అధికారులు, సిబ్బందిని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశించారు.
జిల్లా ఎస్పీ వెంట ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, 1వ పట్టణ సీఐ జె.మురళి, 2వ పట్టణ సీఐ సీహెచ్. లక్ష్మణరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.