రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టు ధిక్కార వ్యాఖ్యలకు పాల్పడి మరో మారు జగన్ ప్రభుత్వం పరువు తీశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు, రాజ్యసభలో మూడు రాజధానుల ఏర్పాటుకు చట్ట సవరణ కోరుతూ ప్రైవేటు బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
రాష్ట్ర హైకోర్టు విభజన చట్టం ద్వారా ఏర్పాటైన అమరావతి రాజధానికి రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఉన్నందున, మళ్లీ మూడు రాజధానుల తీర్మానం చేసే హక్కు మరో మారు రాష్ట్ర శాసనసభకు లేదని మాత్రమే అందని, అవసరమైతే పార్లమెంట్ ను చట్ట సవరణ కోరవచ్చని చెప్పిందని గుర్తు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన బాధ్యత పరమైన తీర్పును రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి న్యాయస్థానం పరిధి దాటిందంటూ వక్రీకరించే ప్రయత్నం చేశారని
పేర్కొన్నారు. బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ పదేపదే న్యాయస్థానాల పరువు తీస్తున్న వ్యాఖ్యలకు రాజ్యసభ చైర్మన్ తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానాలు కూడా సుమోటుగా స్వీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడు రాజధానుల రాజకీయ ఓట్ల నినాదానికి చట్ట సభలను కూడా ప్రచార వేదికలుగా వాడుకుంటున్నారని
దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు న్యాయస్థానాలపై, న్యాయ మూర్తులపై చేస్తున్న అపవాదులను అడ్డుకో లేకపోతే, న్యాయస్థానాలకు కళంకం అంటే ప్రమాదం ఉందని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎపీలో కోర్టులపై, జడ్జిలపై వైకాపా వార్డు మెంబర్లు కూడా అదుపు తప్పి మాట్లాడుతున్నారని,
చులకన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు మాయని మచ్చ అని తెలిపారు. నాలుగేళ్ళు ప్రత్యేక హోదా పై మౌన వ్రతం చేపట్టిన వైకాపా ఎంపీలు తాజాగా మెళకువ వచ్చి ఏపీకి హోదా ఏదీ?అని అడగటం మరో డ్రామాగా అభివర్ణించారు. ఇన్నాళ్ళు పార్లమెంట్ ఆవరణలో గడ్డి పీకారా? అని ప్రశ్నించారు.
దమ్ముంటే హోదా కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని కేసు విచారణ లో ఉండగా, చేస్తున్న కోర్టు ధిక్కార వ్యాఖ్యలపై కోర్టులు సుమోటోగా కేసులు పెడితే, పరిస్థితి కొంత కంట్రోల్ అవుతుందని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.