విజయవాడలో హవాలా సొమ్ము హల్ చల్ చేసింది. హైదరాబాద్ కు హవాలా సొమ్ము తరలిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు నేడు అరెస్టు చేశారు.
పక్కా సమాచారం రావడంతో విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి. శ్రీనివాసులు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఏడిసిపి డాక్టర్ కె వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసిపి టి కనకరాజు, ఏసిపి వి ఎస్ ఎన్ వర్మ, ఇన్ స్పెక్టర్ పి.కృష్ణ మోహన్ వాహనాలు తనిఖీ చేశారు.
భవానీ పురం పోలీస్ స్టేషన్ పరిథిలోని గొల్లపూడి వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఎపి37బిడబ్ల్యూ4532 నెంబర్ గల షిఫ్ట్ కారులో కోటి 47 లక్షల రూపాయల హవాలా సొమ్ము దొరికింది. సీటు వెనుక ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఎవరికి కనపడకుండా అమర్చి ఈ సొమ్మును రవాణా చేస్తున్నారు.
డబ్బుతో బాటు 34 వేల అమెరికన్ డాలర్లు కూడా నిందితుల వద్ద దొరికాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన అన్నదమ్ములు చామకూరి ఆనందరావు, హరిబాబు లు దేవి జ్యువెలరీ మార్టులో పని చేస్తుంటారు.
ఆ షాపు యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ ఈ సొమ్ము మొత్తం వీరికి ఇచ్చి హైదరాబాద్ లోని ప్రవీణ్ కుమార్ జైన్ సోదరుడు కీర్తికి ఇచ్చేందుకు బయలు దేరారు. ఈ కోటిన్నర లో విజయవాడకు చెందిన వల్లూరి శివనాథ్, భరత్, దివాకర్ ల డబ్బు కూడా ఉంది.
ఈ మొత్తం డబ్బుకు ఎలాంటి బిల్లలు లేవు. చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబు, వల్లూరి శివనాథ్, ప్రవీణ్ కుమార్ జైన్ లను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్సు సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అభినందించారు.