విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు (85) బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. రెండవ కుమారుడు ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి గా వ్యవహరిస్తుండగా కుమార్తె రమాకుమారి యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ గా పని చేస్తున్నారు. తులసిరావు తొలిసారిగా1986 ఆగస్టు29న విశాఖ డైరీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే చైర్మన్ గా ఎన్నికవుతూ వస్తున్నారు. దేశ డైరీ రంగంలో 37 ఏళ్ల పాటు ఒక డైరీ చైర్మన్ గా వ్యవహరించిన తొలి చైర్మన్ తులసిరావు. కేవలం11 కోట్ల టర్నోవర్ వున్న డైరీని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రస్తుతం1400 కోట్ల టర్నోవర్ కంపెనీగా తీర్చిదిద్దారు. ఆయన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతీ ఏటా లాభాల్లో డైరీ నడిచింది. రైతుల సంక్షేమానికి వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
మిల్క్ ప్రొడ్యూసర్ ఎంప్లాయిస్ ఎడ్యుకేషన్, హెల్త్&మెడికల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మల్టీ స్పెషలాటి ఆస్పత్రి నిర్మించారు. పాటశాల, జూనియర్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టారు. 1700 గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించారు.1500 గ్రామాల్లో వ్యవసాయ బోర్ వెల్స్ ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపాలు,బ్రిడ్జి లు నిర్మించారు.