రాజకీయాలకతీతంగా వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు, వైరా ఎమ్మెల్యే లావిడియా రాములు నాయక్ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే రాములు నాయక్ వెంట నడిచి, పార్టీ ద్వారా, ఎమ్మెల్యే ద్వారా పదవులు అనుభవిస్తూ స్వార్థంతో, స్వలాభంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేని వీడి వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఇది నమ్మకద్రోహం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి నాయకుల పోకడలను ప్రజలు
గమనిస్తున్నారని తెలిపారు. కుట్రలు, కుతంతాలకు టిఆర్ఎస్ పార్టీలో తావు లేదని అన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వైరా ఎమ్మెల్యేగా గెలుపొందిన రాములు నాయక్ విజయం రాష్ట్రంలోనే చారిత్రకమని అన్నారు.
అటువంటి విజయానికి మేము కారకులమని కొంతమంది నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యేగా రాములు నాయక్ గెలుపొందిన నాటి నుంచి గత నాలుగు ఏళ్లుగా వైరా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారని అన్నారు.
అంతేకాక అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వ విధానాలను కచ్చితంగా అమలు జరిగేలా ప్రణాళికలు చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. నిన్నటిదాకా పార్టీలో పదవులు అనుభవిస్తూ, ఎమ్మెల్యే పక్కన తిరుగుతూ గత కొద్ది రోజుల నుంచి స్వార్థంతో బయటకు వెళ్లి ఆరోపణలు చేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, వేల్పుల నరసింహారావు, యదళ్ళపల్లి వీరభద్రం, ఎంపీపీ లావిడియా సోనీ, వైస్ ఎంపీపీ గాదెనిర్మల, జడ్పిటిసి భూక్య కళావతి, సర్పంచులు బానోతు నరసింహారావు, గలిగే సావిత్రి, ధారావత్ రోజా, నాయకులు దుద్దుకూరు కృష్ణ ప్రసాద్, నవీన్, చాపలమడుగు రామ్మూర్తి, మోదుగు నరసింహారావునరసింహారావు, దేవరకొండ కిరణ్, తిరుపతి, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.