సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. 1.10.2023 నాటికి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 2, 3వ తేదీలు శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపులల్లో ప్రతి ఓటరు తన ఓటును పరిశీలన చేసుకోవాలని చెప్పారు.
తప్పులు లేని పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనలో బాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపుల్లో ఏమైనా తప్పొప్పులుంటే ఓటరు నిర్ణిత ప్రోఫార్మాలో దరఖాస్తులు చేయాలని చెప్పారు.ప్రత్యేక శిబిరాలు నిర్వహణ రోజుల్లో జిల్లా లోని 1095 పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని తెలిపారు.
కొత్తగా ఓటరు నమోదుకు ఫారం-6, సవరణలు, మార్పులు చేర్పులకు ఫారం 8, తొలగింపుకు ఫారం 7 ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫారం 6,7 మరియు 8 ఫారాలు అన్ని పోలింగ్ కేంద్రాలలో బి ఎల్ ఓ ల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది, ఏవేవి తప్పులు ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలన్నారు. స్థానిక బి ఎల్ ఓ లేదా ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ద్వారా కొత్తగా ఓటరు నమోదుకు ఫారం 6, సవరణలకు సంబంధించి ఫారం -8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అదే విధంగా చనిపోయిన ఓటర్ల పేరు తొలగింపుకు 7 వినియోగించాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని, అర్హత గల ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. క్యాంపుల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లకు అవగాహన కల్పించాలని చెప్పారు.