సెప్టెంబర్ 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఎం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాలని నిర్ణయించిందని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ప్రభుత్వం పేదల నడ్డి విరిచే విధంగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతోందని ఆయన విమర్శించారు. ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలం అవుతుందని అన్నారు.
కార్పొరేట్ వ్యాపారవర్గానికి మేలు చేసే పద్ధతిలోనే కేంద్ర ప్రభత్వ పాలన సాగుతోందని తెలిపారు, పేద, మధ్య తరగతి ప్రజల బాధలను, సమస్యలను, విధానాలను అమలు పరుస్తూనే, మరోవైపు ప్రమాదకర మతోన్మాద రాజకీయాలను ముందుకు తెస్తోందని తెలిపారు.
దీనివలన ప్రజల మధ్య వైషమ్యాలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సైతం ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని విమర్శించారు. సంక్షేమ పథకాల పేర ప్రచార ఆర్భాటాలు తప్పి, ప్రజల దైనందిన, దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంలో విఫలమవుతోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం దేశవ్యాపిత పోరాటాలను నిర్వహిస్తోందని, ఈ ప్రజా పోరాటాలలో ప్రజలు అత్యధికంగా పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే ఈ నెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను తెలంగాణలోని ప్రతి పల్లెలో, పట్టణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
భూమి, భుక్తి, వెట్టి నుండి విముక్తి, ఆత్మ గౌరవ జీవనం వంటి నినాదాలతో జరిగిన చారిత్రిక పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా వారోత్సవాల పేరు మీద ప్రజలను వివరించాలని కోరారు. మన ప్రాంత ఘనమైన చరిత్రను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని అన్నారు. సిపిఎం నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో ప్రజలు విస్తృతంగా పాల్గొని, తమ పూర్వీకుల పోరాట త్యాగాలనుస్మరించుకోవాలని, ఆ పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. నాటి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.