సఫాయి కర్మచారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చైర్మన్ వెంకటేషన్ జి తెలిపారు.
మంగళవారం వనపర్తిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకున్న అనంతరం సితార గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మున్సిపాలిటీలలో పనిచేసే కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు.
కొత్తకోట మున్సిపాలిటీ లో కార్మికులకు గ్లౌజులు ఇవ్వడం లేదని కమిషన్ దృష్టికి కార్మికులు తీసుకువచ్చారు. అలాగే ఈఎస్ఐ కార్డులు రాలేదని, డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని వారు తెలిపారు. వేతనాలు పెంచాలని, విలీనం చేసిన గ్రామాల తో మున్సిపాలిటీ పెరిగిందని కార్మికులు తక్కువగా ఉన్నారని కార్మికులను పెంచాలని కోరారు.
ఈ సందర్భంగా సఫాయి కర్మచారి కమిటీలను వేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ను కమిషన్ చైర్మన్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వ రావు, ఏజేసీ వేణుగోపాల్,డిఎస్పీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సఫాయి కర్మచారిలు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి