వనపర్తికే వన్నె తెచ్చిన స్వర్గీయ మాజీ బిసి ఎమ్మెల్యేలు జయరాములు, డాక్టర్ బాలకిష్టయ్య బీసీ వర్గానికి చెందిన వారని కనీస గౌరవం ఇవ్వకుండా నేటికి వారి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపలేదని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ విమర్శించారు.
వనపర్తిలో విష సంస్కృతిని మళ్ళీ మొదలు పెట్టారని, గడీల పాలనను బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే వున్నాయని చెప్పారు. శుక్రవారం వనపర్తి లోని లక్ష్మి కృష్ణ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాలను అందలమెక్కించి బీసీలపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని, బీసీ,ఎస్సి, ఎస్టీ మైనారిటీలను కలుపుకుని ప్రజాస్వామ్యబద్దంగా మరో ప్రజా పోరాటాన్ని చేపడతామని ఆయన తెలిపారు.
వనపర్తిలో నేడు ప్రతాపరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో అంతర్యమేమిటో వనపర్తి ప్రజలకు వివరించాలని రాచాల డిమాండ్ చేశారు. వనపర్తిలో బీసీలు వద్దు…అగ్రవర్ణాలే ముద్దు అన్న చందంగా వ్యవహారం దాపురించిందని, ఇంతకంటే దురదృష్టకరమైన సంఘటన మరొకటి లేదని ఆయన విమర్శించారు.
వాల్మీకి విగ్రహం ఏర్పాటు కూడా అడ్డుకున్నారు
మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి విగ్రహానికి తాము వ్యతిరేకం కాదని,అదే మాజీ ఎమ్మెల్యేలు బీసీ వర్గానికి చెందిన జయరాములు, బాలకిష్టయ్య విగ్రహాలు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రామాయణాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారని, బీసీలపై మొసలి కన్నీరు కారుస్తూ అగ్ర వర్ణాల అరాచకాలకు ఆజ్యం పోస్తున్నారని బీసీలందరూ ఈ విషయాన్ని గ్రహిస్తున్నారని ఆయన తెలిపారు.
భేషజాలకు పోకుండా బీసీలపై వివక్షత చూపకుండా బీసీలను అణచివేసే ధోరణి మానుకోవాలని బీసీల జోలికొస్తే సహించేది లేదని,ఇక నియంత డ్రామాలు సాగవని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హిందు వాహిని పట్టణ అధ్యక్షుడు శివ కృష్ణ యాదవ్, వాల్మీకి సంఘం పట్టణ కార్యదర్శి ఎద్దుల రవి నాయుడు, మండ్ల రాజు,మహేష్, గణేష్ ,సురేష్, నవీన్,వెంకటేష్ నాయుడు రవి నాయుడు,బాలు పాల్గొన్నారు.