భారతదేశంలో మరణం లేని మహోన్నతుడు భగత్ సింగ్ అని దేశం ఉన్నంత కాలం చరిత్రలో భగత్సింగ్ నిలిచిపోతారని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. నునుగు మీసాల వయస్సులోనే భారతదేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీర కిషోరం భగత్సింగ్ అన్నారు. భగత్సింగ్ 92వ వర్థంతిని పురస్కరించుకుని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో భగత్సింగ్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత భగత్సింగ్ చిత్ర పటానికి పువ్వాడ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ భగత్సింగ్, రాజగురు సుఖ్ దేవ్ లాంటి వ్యక్తులు దేశ సాత్వంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటాలను నిర్వహించారని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ ముష్కరులను ఈ దేశం నుంచి తరిమికొట్టేందుకు తుదిశ్వాస వరకు పోరాడారన్నారు. మతం, కులం అనే పదాలకు భగత్సింగ్ ఏ నాడు అవకాశం కల్పించ లేదని దురదృష్టవశాత్తు నేటి పాలకులు ఆ రెండింటి ప్రాతిపదికనే పాలన సాగిస్తున్నారని పువ్వాడ తెలిపారు.
పాలకుల వ్యవహార తీరు దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ఆర్థిక అంతరాల నేపథ్యంలో భగత్సింగ్ను స్ఫూర్తిగా తీసుకుని యువజన విద్యార్థులు మరో పోరాటానికి సంసిద్దులు కావాలని పువ్వాడ పిలుపునిచ్చారు. యువత మాత్రమే ఈ సమాజ గతిని మార్చగలదని అది అనేక సందర్భాలలో రుజువైందని ఇప్పుడు కూడా యువత పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై బహుముఖ పోరాటాలకు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భగత్సింగ్ ఆశయ సాధన కోసం పునరంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు సిద్దినేని కరకుమార్, జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, నాయకులు ఎం. శ్రవణ్, ఎం. లక్ష్మణ్, ఓంప్రకాష్, ఎస్కె షా, కౌషిక్, నాగులమీరా, సాయిగణేష్ పాల్గొన్నారు.