ఎవరితో పొత్తు వున్న, లేకపోయినా సిపిఐ కొత్తగూడెం లో పోటీచేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు . తమకు బలమున్న చోట పోటీచేయకుండా ఎవరు తమను ఆపలేరని స్పష్టం చేశారు. బీఆర్ యస్ తో కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని ఉభయ కమ్యూనిస్టులం అనుకున్నాం కానీ బీఆర్ యస్ వైపు నుంచి సరైన స్పందన రావడంలేదని, అందువల్ల తాము కొత్తగూడెం , వైరా , హుస్నాబాద్ , మునుగోడు , బెల్లంపల్లి నియోజకవర్గంలలో పోటీ చేయాలని నిర్ణయించామన్నారు .
సిపిఐ పోటీచేసే దగ్గర సిపిఎం , సిపిఎం పోటీచేసే దగ్గర సిపిఐ పోటీచేయకూడదని ఒక అంగీకారానికి వచ్చామని అన్నారు . మునుగోడు ఉపఎన్నికల్లో అధికార బీఆర్ఎస్కు సీపీఐ మద్దతిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, కమ్యూనిస్ట్లు కలిసి వెళ్తారనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో మాత్రం సీపీఐ ఖచ్చితంగా బరిలోకి దిగుతుందని చెప్పారు. పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం, వైరా నియోజకవర్గాలను సీపీఐ కోరుతుందని అన్నారు . మరోవైపు ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తాము పోటీలో ఉంటామని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కూనంనేని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కూనంనేని 2009లో కొత్తగూడెం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018లో ఓడిపోయారు. ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గా వున్న ఆయనే కొత్తగూడెం లో సిపిఐ అభ్యర్థిగా వుండే అవకాశం వుంది.