విషవాయువు ప్రభావంతో అతలాకుతలం అవుతున్న విశాఖ పట్నం వైసీపీ ప్రముఖ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నది. ఎల్ జి పాలిమర్స్ నుంచి విషవాయువు వెలువడి 12 మంది మరణించిన తర్వాత ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి విశాఖకు రాలేదు.
అంతకు ముందు విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి ఎంతో కీలకంగా వ్యవహరించారు. రాజధాని తరలింపు ప్రక్రియ నుంచి కరోనా వరకూ ఆయన నేతృత్వంలోనే విశాఖ పట్నం అధికార యంత్రాంగం మొత్తం పని చేసింది. కరోనా విరాళాలను కూడా విజయసాయి రెడ్డి ఎంతో సమర్ధంగా అందరి నుంచి వసూలు చేసి అక్కడ ఖర్చు చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు.
కరోనా వైరస్ పై విజయసాయి రెడ్డి రాత్రంబగళ్లూ విశాఖలో పని చేశారు. ఆయన నేతృతంలో చాలా కాలం పాటు కరోనా విశాఖ కే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తానికి రాకుండా ఆగిపోయింది. అంతలోనే ఎల్ జి పాలిమర్స్ ప్రమాదం సంభవించింది. ఎల్ జి పాలిమర్స్ నుంచి విషయవాయువులు వ్యాపించి 12 మంది మరణించారు.
ఈ ప్రమాదం జరిగినప్పుడు విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి విశాఖ పట్నం రావాల్సి ఉంది. అయితే తన కారునుంచి ముఖ్యమంత్రి ఆయనను దించేశారు. ఈ విషయం సత్యం న్యూస్ రిపోర్టు చేసిన విషయం పాఠకులకు తెలుసు.
ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరినా ఏలూరు వచ్చే సరికి ఏమైందో ఏమో గానీ ఆయన తిరుముఖం పట్టారు. విశాఖ పట్నం వెళ్లలేకపోయారు. విశాఖపట్నం వెళ్లలేక పోయిన విజయసాయి రెడ్డి అమరావతి లో కూడా ఉండకుండా రాష్ట్ర సరిహద్దులు దాటేసి హైదరాబాద్ వచ్చేశారు.
కరోనా లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు దాటిన వారు 24 రోజులు క్వారంటైన్ లో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఏర్పాటు చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు కూడా ఎంతో కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారు.
వలస కూలీలతో సహా ఎవరినీ తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి రానివ్వడం లేదు. అదే విధంగా తెలంగాణ కూడా ఆంధ్రావారిని రానివ్వడం లేదు. అయితే విజయసాయి రెడ్డి కి మాత్రం ఈ నిబంధనలు ఏవీ వర్తించలేదు. ఆయన నేరుగా ఆంధ్రాలోని కరోనా ప్రభావిత అమరావతి ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చేశారు.
ఈ సంగతి ఎలా ఉన్నా విజయ సాయి రెడ్డి కోసం విశాఖ పట్నం మాత్రం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నది. విజయసాయి రెడ్డి వచ్చి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించి ఉన్నట్లయితే విశాఖ పట్నంలో ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఉండేవి కాదని కూడా అందరూ అంటున్నారు.