భారత సాయుధ త్రివిధ దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హఠాన్మరణం యావత్ దేశాన్ని కలిచివేసింది. ఆయన ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడు నీలగిరి కొండల్లోని కూనూరు సమీపంలో కుప్పకూలడంతో సీడీఎస్, ఆయన భార్య మధులికా, ఆర్మీ ఉన్నతాధికారులతో సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు.
దేశ ప్రతిష్టకు, సాయుధ బలగాలకు నేతృత్వం వహించేది కావడంతో చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచే వీలుండదు. విషాదకర సమయాల్లోనూ బలగాలు విధి నిర్వహణలో రాజీపడరాదనే సూత్రాన్ని అనుసరిస్తూ జనరల్ బిపిన్ రావత్ వారసుడి ఎంపికపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.
అయితే తదుపరి సీడీఎస్ గా ఎవరిని నియమిస్తారు? అసలు ఈ సీడీఎస్ పదవి విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తదుపరి సీడీఎస్ను కేంద్రం నియమిస్తుందా? లేదంటే రాష్ట్రపతి విశేషాధికారాల్లో దీనిని కలిపేస్తుందా? ఏం చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
రక్షణ విషయంలో రాజీ కూడదన్న విషయంలో కేబినెట్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. త్రివిధ దళాలకు చెందిన ఏదో ఒక దళంలో విశేష సేవలందించి, అనుభవం గడించిన మాజీ అధికారికి ఈ బాధ్యతలు అప్పజెబుతారా? అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. వాయుసేన, ఆర్మీ, నేవీకి వేరువేరుగా అధిపతులు ఉండేవారు. ఈ దళాల మధ్య మరింత సమన్వయం కోసం సీడీసీ పదవిని సృష్టించడం జరిగింది. ఈ పదవిలో తొలిగా నియమితులైన వ్యక్తి బిపిన్ రావత్.. 2020 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు.