రాజ్యాంగ పదవులు, సలహాదారు పదవులు, నామినేటెడ్ పదవులు అన్నీ కేటాయిస్తున్నా కూడా జగన్ ప్రభుత్వంపై రెడ్లు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ రెడ్డి కులస్తులే ఎదురుతిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు శివ ప్రసాదరెడ్డి తమ సొంత ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలా పై స్థాయిలోనే కాకుండా కింది స్థాయి లో కూడా రెడ్డి కులస్తులలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు పరిశీలిస్తే ఇది అర్ధం అవుతున్నది. వైసీపీ పార్టీ అంటే పిచ్చి అభిమానంతో పార్టీ లో చేరాను. బంగారం తాకట్టు పెట్టి మరీ సినిమాహాలు అద్దెకు తీసుకొని యాత్ర సినిమా ప్రదర్శనలు చేసి లక్షలు ఖర్చుపెట్టాను. వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టాను. వైసీపీ అధికారంలోకి వచ్చాక బెల్లంకొండ మండల జడ్పీటీసీ గా గెలిచాను.
పార్టీ కోసం నాకున్న 120 ఎకరాలు పొలం నుంచి దాదాపు 70 ఏకరాలకు పైగా అమ్ముకున్నాను. ఈ నాలుగేళ్ళల్లో నా సొంత సమస్యలే పరిష్కారం చేయలేదు. ఇంక నన్ను నమ్మి గెలిపించిన ప్రజల సమస్యలను ఎలా తీర్చాలి? అంటూ గాదె వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కి, ఎంపీకి, అధికారులకు ఎన్ని సార్లు చెబుతున్నా ఎవరూ సమస్యలు తీరలేదు అంటూ ఆయన తీవ్ర నిర్వేదం వ్యక్తం చేశారు. నన్ను గెలిపించిన ప్రజలకు కూడా పనులు చేయించలేకపోతున్నాను అంటూ బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నాలుగేళ్లలో ఏం చేశామంటే ఏం చెప్పాలని సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అనడం నుంచి రెడ్డి కులస్తులలో ఉన్న అసంతృప్తి బయట పడటం ప్రారంభం అయింది. నెల్లూరు గ్రామీణంలో 2700 పింఛన్లు తొలగించడంపై కోటంరెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శి రావత్పైనా పలు విమర్శలు చేశారు. రోడ్లు సరిగాలేవని పొట్టెపాలెం వద్ద వంతెన నిర్మాణం నిధులు కొరత ఉందని, మురుగు కాలువలు వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.
గత వారం పది రోజులుగా జరుగుతున్న సంఘటనలే కాదు. రాష్ట్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో కూడా రెడ్డి కులానికి చెందిన ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. బాలినేని శ్రీనివాస రెడ్డి నుంచి పలువురు నాయకులు వైసీపీ అధిష్టానం నిర్ణయానికి ఎదురు నిలిచారు. బలవంతంగా అసంతృప్తిని అణచివేసినా కూడా నివురుగప్పిన నిప్పులా అది వెలుగుతూనే ఉన్నదని తాజాగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ సలహాదారులు అందరూ రెడ్డి కులస్తులనే నియమించారు.
నామినేటెడ్ పదవుల నుంచి దాదాపు అన్ని కీలకమైన పదవులను రెడ్లకే అప్పగించారు. బీసీలు ఇతర కులాలకు చెందిన మంత్రులు ఉన్న చోట రెడ్డిని సలహాదారుడిగానో, సంబంధిత కార్పొరేషన్ చైర్మన్ గానో నియమించి పాలన సాగించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని వ్యవస్థలలోనూ రెడ్డి కులస్తులే అధికంగా ఉన్నారు. అయినా రెడ్డి కులస్తులలో ఎందుకు అసంతృప్తి ఉన్నదో తెలియక, అర్ధం కాక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.