విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేస్తున్నట్లు ప్రకటన రాగానే రాజకీయ పార్టీలన్నీ ఉద్యమంలోకి దూకాయి.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఉద్యమంలోకి రాలేదు కానీ తెలుగుదేశం నుంచి కమ్యూనిస్టు పార్టీలన్నీ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలనే నినాదంతో ఆందోళన చేస్తున్నాయి.
అదే విధంగా విశాఖ ఉక్కు సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అది అలా ఉంచితే శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు.
మీడియాలో హైలైట్ అవుతున్న ఈ వార్తలో నిజం ఎంత? నిజమే కదా, ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కదా, అనుమానం ఎందుకు అని ప్రశ్నించవచ్చు.
అయితే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ చూస్తూ ఎందుకు ఈ నాటకం? అనే ప్రశ్న తలెత్తుతున్నది. గంటా శ్రీనివాసరావు స్పీకర్ కు పంపిన రాజీనామా లేఖలో ఆయన చిత్త శుద్ధి కనిపించడం లేదు.
స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా లేఖ లేకపోతే దాన్ని స్పీకర్ ఆమోదించే అవకాశం లేదు. షరతులతో కూడిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేరు.
విశాఖ స్టీట్ ఫ్యాక్టరీ తరలింపు ప్రారంభం కాగానే రాజీనామా ఆమోదించండి అంటూ అతి తెలివితో గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ సమర్పించడమే ఆశ్చర్యం కలిగిస్తున్నది.
విశాఖ ఉక్కు ఫ్యాకర్టీపై చిత్తశుద్ధితో ఆయన పోరాడాలనుకుంటే రాజీనామా చేసే పద్ధతి ఇది కాదు. ఎలాంటి షరతు లేకుండా రాజీనామా పత్రం సమర్పించాలి.
మంత్రిగా పని చేసి, విశేషమైన అనుభవం కూడా ఉన్న గంటా శ్రీనివాసరావు షరతులతో కూడిన రాజీనామా లేఖ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం అధికారికంగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది.
ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాకు అభ్యంతరం పెట్టేవారు ఉండరు. అలా కాకుండా ఉత్తుత్తి రాజీనామాలు చేసి విశాఖ కార్మికులను పక్కదోవ పట్టించడం ఎందుకో…..