కలియుగ వైకుంఠాన్ని తలపించే ఆదిశిలా క్షేత్రం తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారు, ఏడు కొండలపైనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక రూపాలలో వెలసి తన భక్తులను పావనం చేస్తున్నాడు. ఏడుకొండలపై పాదం మోపకముందే తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో గల మల్దకల్ మండలంలో ఆదిశిలలో శ్రీనివాసుడు ఉద్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఒకే శిలలో స్వామివారు ఆంజనేయ, వరాహ, అనంతశయనమూర్తి , లక్ష్మీ రూపంలో వెలియటమే ఈ క్షేత్రం ప్రత్యేకత.
మల్దకల్ మండల కేంద్రంలో పవిత్ర కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య వెలసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలే కాకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచీ, పక్క రాష్ట్రాల నుంచీ కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ మల్దకల్ ఆదిశిలా క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
5వ శక్తి పీఠమైన అలంపురం జోగుళాంబ అమ్మవారి సన్నిధికి దగ్గరలో ఈ ఆలయం కొలువై ఉంటుంది. ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరిగే తిమ్మప్ప స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారిని స్థానికులు, భక్తులు మల్దకల్ తిమ్మప్పగా కొలుస్తుంటారు.
సాధారణంగా వేంకటేశ్వరుడికి మొక్కుబడి చెల్లించుకోవాలంటే, ఎంత దూరంనుంచైనా సరే భక్తులు తిరుమల చేరుకుంటారు. కానీ మల్దకల్ వాసులు మాత్రం తిరుమల వెళ్లకుండా ఆయనతో సమానంగా తిమ్మప్పను కొలుస్తూ, ఆయనకు ప్రీతికరమైన దాసంగంతో మొక్కుబడులు అక్కడే తీర్చుకుంటారు. ఇకపోతే తెలిసో, తెలియకో ఈ ప్రాంతవాసులెవరైనా తిరుమల వెళితే వారి ఇంటిలో అశుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంతేగాక రెండవ అంతస్తు కూడా నిర్మించరు.
ప్రతి యేడాది మార్గశిర శుద్ధ పంచమి రోజునుంచి మార్గశిర కృష్ణ తదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటిని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఊరేగింపు, పల్లకి సేవల్లో పాల్గొంటారు. అలాగే ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజు రాత్రి స్వామివారి రథోత్సవం శోభాయమానంగా జరుగుతుంది.
ఆలయ స్థల పురాణము చూస్తే.. ఏడుకొండలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా మల్దకల్లో శ్రీవారు ఆదిశిలలో వెలసినట్లు బ్రహ్మాండ పురాణంలో పలు ఆధారాలున్నాయి. ఇక్కడ ఒకే శిలలో స్వామివారు ఆంజనేయ, వరాహా, అనంతశయనమూర్తి, శ్రీదేవి-భూదేవిలు వెలయటంతో ఈ క్షేత్రానికి విశేష ప్రాచుర్యం సంతరించుకుంది.
గతంలో విద్వత్ గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన నల్లసోమభూపాలుడు ఈ ప్రాంతానికి వేటకురాగా తాను అధిరోహించిన గుర్రం ముందుకు కదల లేకపోయింది. దీంతో అక్కడ ఏదో మహత్యం ఉన్నదని ఓ బోయ వాల్మీకి బాలుడు రాజుకు కనిపించి అక్కడ శిలపై తిమ్మప్ప స్వామి అవతరించడం వల్ల ఇక్కడ మహత్యం ఉన్నదని తెలిపాడు. అంతటితో రాజు అక్కడ దేవాలయాన్ని నిర్మించి తనకు సహాయ సహకారాలను అందించినందువల్ల అతడినే ఆ ఆలయానికి పూజారిగా నియమించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకనే నేటికీ బోయ వంశస్థులే ఈ ఆలయంలో పూజారులుగా వ్యవహరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే.. అయిజ, గద్వాల రోడ్డు మధ్యన గద్వాలకు 18 కిలోమీటర్ల దూరంలో మల్దకల్ ఆదిశిలా క్షేత్రం వెలిసింది. ఈ ఆలయం చేరుకునేందుకు గద్వాల, ఎమ్మిగ నూర్, రాయచూర్, వనపర్తి, కర్నూల్ డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. మరోవైపు.. వేలాదిమంది భక్తులు తరలివచ్చే తిమ్మప్ప జాతరకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతి గదులు లేనందున.. కర్ణాటక, తెలంగాణ ఇతర భక్తులు వాటి నిర్మాణాలు చేపట్టారు. జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్ జిల్లాలో పేరెన్నిక గన్న జాతరలలో మల్దకల్, కురుమూర్తి జాతరలు మంచి గుర్తింపు కలిగి ఉన్నాయి. జాతరలో పశువులు, ఇంటి సామగ్రి, రైతుల పనిముట్లు కలప, చిన్న పిల్లల ఆట వస్తువుల నుంచి పెద్దలకు ఉపయోగపడే పరికరాల వరకు లభిస్తాయి. వలస వెళ్లేవారు అధికం కావడంతో ఈ జాతరలో ట్రంకు పెట్టెలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది.
దాసంగాల సమర్పణ…
రైతులు పండించిన పంట నుంచి వచ్చిన బియ్యంతో ముందుగా స్వామివారి బ్రహ్మోత్సవాల సంధర్భంగా దాసంగం ద్వారా నైవేద్యం చేస్తారు. కొత్త కుండలను తెచ్చి స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతనే భక్తులు బుజిస్తారు ఆ కుండనే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంట్లో పెట్టుకుని పూజిస్తారు ఇది ఈ జాతరలో ప్రత్యేక విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన తిమ్మప్ప ఆలయాన్ని దేవాదాయశాఖ, దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహల్లాద రావు కార్యనిర్వహణాధికారి ఎం సత్య చంద్రారెడ్డి ఆలయ మహత్యమును వివరించారు.