టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం తీస్కున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు.
అధిష్టానం ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని రోజుల తరబడి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారని మల్లు రవి అన్నారు.
టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నియామకం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియమ్మ ఆదేశాలతో జరిగింది కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ ను నిందించడం పార్టీ క్రమశిక్షణా రహిత్యమని అన్నారు.
పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం అంటే సోనియమ్మను విమర్శించినట్టేనని, ఇది లోపాయికారిగా కేసీఆర్ ఎజెండాను అమలు చేస్తున్నట్టేనని వారు విమర్శించారు. ఏదైనా అభిప్రాయ బేధాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించాలే కానీ పత్రికలకు ఎక్కడం పద్ధతి కాదని వారు సూచించారు.