మూడు నెలల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కరోనా లాక్డౌన్ ఆంక్షల కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులు, ప్రవాస భారతీయులు హైదరాబాద్ చేరుకున్నారు. 250 మందికిపైగా గురువారం అర్ధరాత్రి ఖతర్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు.
అంతకు ముందు వీరు అమెరికాలోని షికాగో, న్యూయార్క్, డాలస్ నగరాల నుంచి ఖతర్ ఎయిర్వేస్కే చెందిన మూడు ప్రత్యేక విమానాల్లో దోహా చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. ప్రవాస తెలుగు వ్యక్తి రవి పులి, ఆయన ఏర్పాటు చేసిన యూఎస్–ఇండియా సాలిడారిటీ మిషన్(యూస్ఐఎస్ఎం) టీమ్ ఈ విమానాలను ఏర్పాటు చేశారు.
విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగానే భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఇన్నాళ్లకు సొంతగడ్డపై అడుగు పెట్టామని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. వారిని బంధుమిత్రులు ఆత్మీయంగా స్వాగతించారు. నిబంధనల ప్రకారం ప్రయాణికులు విమానంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. వారిని క్వారంటైన్ కోసం నోవాటెల్ హోటల్కు తరలించారు. రవి పులి, యూస్ఐఎస్ఎంలుకు ప్రయాణికులు ధన్యావాదాలు తెలిపారు.
వాస్తవానికి ఈ నెల రెండోవారంలోనే హైదరాబాద్కు ప్రత్యేక విమానాలు పంపడానికి యూస్ఐఎస్ఎం, రవి పులి ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా ఆంక్షల కారణంగా అనుమతుల విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. రవి పులి బృందం, యూస్ఐఎస్ఎం ప్రతినిధులు భారత, అమెరికా ప్రభుత్వాలకు అధికారులకు అన్ని వివరాలు అందించి అనుమతి తీసుకున్నారు.
అమెరికా నుంచి విమానాలు నడవకపోవడం వల్ల వేలాది మంది భారతీయులు, ప్రవాస భారతీయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ లో ఉద్యోగాలు చేసేవారు మరింత ఇబ్బంది పడ్డారు.