లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వలు తగ్గి పోయినందున వాటిని భర్తీ చేసేందుకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది రక్తదాతల నుంచి రక్తదానం చేయించాలని లక్ష్యంగా క్యాంపులు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేడు మహిళా రక్త దాతల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీనివాసనగర్ కాలనీలో నేడు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యం న్యూస్ తో మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తులు ఎంతో మంది రక్తం కోసం ఎదురు చూస్తున్నారని, అలాంటి అరుదైన వ్యాధితో బాధపడే పిల్లలను ఆదుకోవడం అందరి విధి అని అన్నారు. ఈ కారణంగానే రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.
లాక్ డౌన్ కారణంగా తగ్గిపోయిన రక్త నిధిని పెంచేందుకు అందరూ శాయశక్తులా రక్తదానం చేయాలని ఆయన కోరారు. తాను నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు ఎంతో మంది రక్తదాతలు ముందుకు రావడం తనకు ఆనందం కలిగిస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు తన నియోజకవర్గంలో వలస కూలీలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తున్నామని ఆయన అన్నారు. అదే విధంగా పేదవారిని ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రణాళిక వేసుకుని అమలు చేస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకూ సేవా కార్యక్రమాలను నిరవధికంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.