పోలెండ్ లో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతిచిన్న వయస్సులో ఈ శిబిరంలో పాల్గొన్న మొదటి మహిళ గా రికార్డు సాధించిన దంగేటి జాహ్నవి ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అభినందించారు.
పోలెండ్ నుంచి బుధవారం జాహ్నవి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడనుంచి తన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు వెళ్తూ బొమ్మూరులోని జిల్లాకలెక్టరేట్ కు విచ్చేసిన జాహ్నవి కలెక్టర్ మాధవిలతను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
అనలాగ్ ఆస్ట్రోనాట్ గా శిక్షణ పొంది దేశానికి గర్వకారణంగా నిలిచిన జాహ్నవి భవిష్యత్ లో అంతరిక్షంలోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యం నెరవేరాలని కలెక్టర్ మాధవీలత ఆకాంక్ష వ్యక్తం చేశారు. పోలాండ్ లో జాహ్నవి తీసుకున్న శిక్షణ గురించి కలెక్టర్ తెలుసుకున్నారు.
తమ ద్వారా ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జాహ్నవి తన భవిష్యత్తు కార్యాచరణ , అందుకు అనుగుణంగా తాను రూపొందించిన ప్రాజెక్టు ప్రణాళిక పై కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జాహ్నవిని కలెక్టర్ మాధవీలత శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. జాహ్నవి వెంట రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి తదితరులు ఉన్నారు.